Loading Bible Translation
First-time download in progress. This may take a few seconds…
Telugu Holy Bible Wordproject Bible
48 verses
1ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి యైన కొర్నేలీ అను భక్తిపరుడొకడు కైసరయలో ఉండెను.
2అతడు తన యింటివారందరితోకూడ దేవుని యందు భయభక్తులు గలవాడైయుండి, ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడును దేవునికి ప్రార్థన చేయు వాడు.
3పగలు ఇంచుమించు మూడు గంటలవేళ దేవుని దూత అతనియొద్దకు వచ్చికొర్నేలీ, అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను.
4అతడు దూత వైపు తేరి చూచి భయపడిప్రభువా, యేమని అడిగెను. అందుకు దూతనీ ప్రార్థనలును నీ ధర్మకార్యములును దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి.
5ఇప్పుడు నీవు యొప్పేకు మనుష్యులను పంపి, పేతురు అను మారు పేరుగల సీమోనును పిలిపించుము;
6అతడు సముద్రపు దరినున్న సీమోనను ఒక చర్మకారుని యింట దిగియున్నాడని అతనితో చెప్పెను.
7అతనితో మాటలాడిన దూతవెళ్లిన పిమ్మట అతడు తన యింటి పనివారిలో ఇద్దరిని,తన యొద్ద ఎల్లప్పుడు కనిపెట్టుకొని యుండువారిలో భక్తి పరుడగు ఒక సైనికుని పిలిచి
8వారికి ఈసంగతులన్నియు వివరించి వారిని యొప్పేకు పంపెను.
9మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు పండ్రెండు గంటలకు పేతురు ప్రార్థనచేయుటకు మిద్దెమీది కెక్కెను.
10అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను; ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై
11ఆకాశము తెరవబడుటయు, నాలుగు చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటివంటి యొకవిధమైన పాత్ర భూమిమీదికి దిగివచ్చుటయు చూచెను.
12అందులో భూమి యందుండు సకల విధములైన చతుష్పాద జంతువులును, ప్రాకు పురుగులును, ఆకాశపక్షులును ఉండెను.
13అప్పుడు పేతురూ, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దమత నికి వినబడెను.
14అయితే పేతురువద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్ర మైనది ఏదైనను నేనెన్నడును తినలేదని చెప్పగా
15దేవుడు పవిత్రము చేసినవాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరల రెండవ మారు ఆ శబ్దము అతనికి వినబడెను.
16ఈలాగు ముమ్మారు జరిగెను. వెంటనే ఆ పాత్ర ఆకాశమున కెత్తబడెను.
17పేతురు తనకు కలిగిన దర్శనమేమై యుండునో అని తనలో తనకు ఎటుతోచక యుండగా, కొర్నేలి పంపిన మనుష్యులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలిసికొని, వాకిట నిల��చి యింటివారిని పిలిచి
18పేతురు అను మారుపేరుగల సీమోను ఇక్కడ దిగియున్నాడా? అని అడిగిరి
19పేతురు ఆ దర్శనమునుగూర్చి యోచించుచుండగా ఆత్మఇదిగో ముగ్గురు మనుష్యులు నిన్ను వెదకు చున్నారు.
20నీవు లేచి క్రిందికిదిగి, సందేహింపక వారితో కూడ వెళ్లుము; నేను వారిని పంపియున్నానని అతనితో చెప్పెను.
21పేతురు ఆ మనుష్యులయొద్దకు దిగి వచ్చిఇదిగో మీరు వెదకువాడను నేనే; మీరు వచ్చిన కారణ మేమని అడిగెను.
22అందుకు వారునీతిమంతుడును, దేవునికి భయపడువాడును, యూద జనులందరివలన మంచిపేరు పొందినవాడునైన శతాధిపతియగు కొర్నేలియను ఒక మనుష్యుడున్నాడు; అతడు నిన్ను తన యింటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలెనని పరిశుద్ధదూత వలన బోధింపబడెనని చెప్పిరి; అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యమిచ్చెను.
23మరునాడు అతడు లేచి, వారితోకూడ బయలుదేరెను; యొప్పేవారైన కొందరు సహోదరులును వారితోకూడ వెళ్లిరి.
24మరునాడు వారు కైసరయలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారికొరకు కని పెట్టుకొని యుండెను.
25పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాద ములమీద పడి నమస్కారము చేసెను.
26అందుకు పేతురునీవు లేచి నిలువుము, నేనుకూడ నరుడనే అని చెప్పి అతని లేవనెత్తి
27అతనితో మాటలాడుచు లోపలికి వచ్చి, అనేకులు కూడియుండుట చూచెను.
28అప్పుడతడు అన్యజాతివానితో సహవాసము చేయుటయైనను, అట్టివానిని ముట్టుకొనుటయైనను యూదునికి ధర్మముకాదని మీకు తెలియును. అయితే ఏ మనుష్యుడును నిషేధింప దగినవాడనియైన అపవిత్రుడనియైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించియున్నాడు.
29కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమియు చెప్పక వచ్చితిని గనుక, ఎందునిమిత్తము నన్ను పిలువ నంపితిరో దానినిగూర్చి అడుగు చున్నానని వారితో చెప్పెను.
30అందుకు కొర్నేలి నాలుగు దినముల క్రిందట పగలు మూడుగంటలు మొదలు కొని యీ వేళవరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు యెదుట నిలిచి
31కొర్నేలీ, నీ ప్రార్థన వినబడెను; నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకముంచబడి యున్నవి గనుక నీవు యొప్పేకు వర్తమానము పంపి
32పేతురు అను మారుపేరుగల సీమోనును పిలిపించుము; అతడు సముద్రపు దరినున్న చర్మకారుడైన సీమోను ఇంట దిగియున్నాడని నాతో చెప్పెను.
33వెంటనే నిన్ను పిలి పించితిని; నీవు వచ్చినది మంచిది. ప్రభువు నీకు ఆజ్ఞా పించినవన్నియు వినుటకై యిప్పుడు మేమందరము దేవుని యెదుట ఇక్కడ కూడియున్నా మని చెప్పెను. అందుకు పేతురు నోరుతెరచి ఇట్లనెను
34దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి యున్నాను.
35ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును.
36యేసుక్రీస్తు అందరికి ప్రభువు. ఆయనద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగు దురు.
37యోహాను బాప్తిస్మము ప్రకటించిన తరువాత గలిలయమొదలు కొని యూదయ యందంతట ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియును
38అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెనను నదియే. దేవుడాయనకు తోడైయుండెను గనుక ఆయన మేలు చేయుచు, అపవాదిచేత పీడింపబడిన వారినందరిని స్వస్థపరచుచు సంచరించుచుండెను.
39ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసినవాటికన్నిటికిని మేము సాక్షులము. ఆయనను వారు మ్రానున వ్రేలాడదీసి చంపిరి.
40దేవుడాయనను మూడవ దినమున లేపి
41ప్రజలకందరికి కాక దేవునిచేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతులలోనుండి లేచిన తరువాత ఆయనతో కూడ అన్నపానములు పుచ్చుకొనిన మాకే, ఆయన ప్రత్యక్షముగా కనబడునట్లు అనుగ్రహించెను.
42ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధి పతినిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢసాక్ష్యమియ్యవలెనని మాకు ఆజ్ఞాపించెను.
43ఆయనయందు విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్త లందరు ఆయననుగూర్చి సాక్ష్య మిచ్చుచున్నారనెను.
44పేతురు ఈ మాటలు ఇంక చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరిమీదికి పరిశుద్ధాత్మ దిగెను.
45సున్నతి పొందినవారిలో పేతురుతోకూడ వచ్చిన విశ్వాసులందరు, పరిశుద్ధాత్మ వరము అన్యజనులమీద సయితము కుమ్మరింప బడుట చూచి విభ్రాంతినొందిరి.
46ఏలయనగా వారు భాషలతో మాటలాడుచు దేవుని ఘనపరచుచుండగా వినిరి.
47అందుకు పేతురు మనవలె పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండ ఎవడైనను నీళ్ళకు ఆటంకము చేయగలడా అని చెప్పి
48యేసు క్రీస్తు నామమందు వారు బాప్తిస్మము పొందవలెనని ఆజ్ఞాపించెను. తరువాత కొన్ని దినములు తమయొద్ద ఉండుమని వారతని వేడుకొనిరి.